ప్రణాళిక బద్ధంగా వెళ్తే భారత్ దే అగ్రస్థానం : చంద్రబాబు

by Sumithra |
ప్రణాళిక బద్ధంగా వెళ్తే భారత్ దే అగ్రస్థానం : చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వం విధ్వంసాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ద, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం పరిరక్షింపబడినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని....రాజ్యాంగ పరిరక్షణ కోసం నాటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిగా నేడు రాష్ట్రంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగం మంచిది అయినా దాన్ని అమలు పరిచే వాళ్లు మంచి వాళ్లు కాకపోతే ఫలితం ఉండదని...అదే సమయంలో రాజ్యాంగం ఎలా ఉన్నా దాన్ని అమలు పరిచేవారు మంచి వాళ్లు అయితే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాటను గుర్తుంచుకోవాలని చంద్రబాబు సూచించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని చంద్రబాబు హెచ్చరించారు. నేషన్ ఫస్ట్ అనే సిద్దాంతంలో పౌరులు, ప్రభుత్వాలు పని చేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరికం, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కంకణబద్ధులై పని చేయాల్సి ఉందని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

2047 నాటికి భారత్‌ దే అగ్రస్థానం..

దేశ ప్రజలకు హక్కులు కల్పించిన అత్యున్నత భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఈరోజు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇటీవలే 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని చెప్పుకొచ్చారు. నైపుణ్యం గల పౌరులు, డిజిటల్ స్ట్రెంగ్త్, ప్రపంచంలో ఎవరికీ లేని యువశక్తి భారత దేశానికి ఉందని...వీటిని సవ్యంగా వినియోగించుకోవడం ద్వారా భారత దేశాన్ని ప్రపంచ మేటి దేశంగా మార్చవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు పాలసీలు తీసుకువచ్చి వాటిని అమలు చేస్తే....ప్రపంచాన్ని జయించే శక్తిగా భారత్ మారుతుందని చెప్పుకొచ్చారు.

ఇప్పుడే 'విజన్-2047' సిద్ధం చేసుకుని....ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడం ద్వారా...దేశం 100 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల్లో 1 లేదా 2వ స్థానాలకు చేరుతుందని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీ వంటి విభాగాల్లో ఇప్పటికే ప్రపంచంలో ఉన్నత స్థాయికి భారతీయులు చేరుకున్నారని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం 65 వేల డాలర్లు కాగా....ఇండియన్స్ తలసరి ఆదాయం 1,19,000 డాలర్లుగా ఉండడం మన దేశ పౌరుల సమర్థతకు నిదర్శనం అని అన్నారు.

గ్లోబల్ గవర్నెన్స్ లో భారతీయులు మరింతగా రాణించే అవకాశాలు ఉన్నాయి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నాడు వచ్చిన ఐటీ విప్లవాన్ని అవకాశంగా మార్చుకోవడం ద్వారా తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఉత్తమ విజయాలు సాధించారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న పాలసీలు, సంస్కరణల ఫలితాలను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పొందుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. అవకాశాలు కల్పిస్తే.... తెలుగు ప్రజలు మరిన్ని అద్భుతాలు సాధిస్తారని... ఇదే ఆలోచనతో 2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్దంగా పనిచేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీల అధినేతలు..

Next Story

Most Viewed